అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లోని వసంత కెమికల్స్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఒకరి మృతి

  • తీవ్రంగా గాయపడిన మరికొందరు
  • అధికంగా వేడెక్కడమే కారణమని అనుమానం
  • ఆరా తీసిన హోంమంత్రి అనిత 
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో మరోమారు ఘోర ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్ కంపెనీలో ఈ ఉదయం రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. రియాక్టర్ పేలుడుతో భయాందోళనలకు గురైన కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  అధికంగా వేడెక్కడమే రియాక్టర్ పేలుడుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రియాక్టర్ పేలుడుపై స్పందించిన హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

అక్టోబర్ 2022లోనూ రాంబిల్లి సెజ్‌లో ప్రమాదం జరిగింది. సెయింట్ గోబెన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇంజినీర్ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఎలక్ట్రికల్ ఇంజినీర్ సజీవ దహనమయ్యాడు.

Rambilli SEZ
Visakhapatnam District
Anakapalle

More Telugu News